తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది జనసేన పార్టీ. తెలంగాణలో గడిచిన పదేళ్లుగా ఓ వెలుగు వెలిగిన కీలక వ్యక్తులు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధుల జాబితా విడుదలైంది. మొత్తం 19 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందులో డాక్టర్ గడల శ్రీనివాసరావు కూడా ఉన్నారు. నియామకంపై స్పందించిన శ్రీనివాసరావు, తనపై నమ్మకంతో కీలకమైన బాధ్యతను అప్పగించిన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతను ఎంతో వినమ్రతతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు ఆయన. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజా సమస్యలపై బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
ప్రజాసేవ తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన గమ్యమన్న ఆయన, బాధ్యతలు మారొచ్చు కానీ లక్ష్యం ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొస్తూ పార్టీకి-ప్రజలకు మధ్య బలమైన వారధిలా పని చేస్తానన్నారు. ఇంతకీ గడల శ్రీనివాసరావు ఎవరు? గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ మంది నేతలు ఉండడంతో సైలెంట్ అయిపోయారు.
తెలంగాణలో రాజకీయ పార్టీలను గమనిస్తున్న ఆయన, రెండు నెలల కిందట జనసేన పార్టీలో గడల శ్రీనివాసరావు చేరారు. ఆ తర్వాత ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది ఆ పార్టీ. కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా ఆయన వ్యవహరించారు. ఆ సమయంలో పదే పదే మీడియా ముందుకు వచ్చిన ప్రజలను అలర్ట్ చేశారు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. తనకున్న పరిచయాలతో గత ఎన్నికల్లో ఆయన టికెట్ దక్కించుకోలేకపోయారు. చివరకు జనసేన గూటికి చేరుకున్నారు. ఇప్పటి నుంచి ఖమ్మం జిల్లాలోని తన సొంత నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు అడుగులు వేస్తున్నారు ఆయన.








