AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎదురు నిలబడలేక.. తనను ఓడించేందుకు బీజేపీ-బీఆర్ఎస్ భారీ కుట్రలు-సీఎం రేవంత్‌రెడ్డి..

తప్పులు ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్-బీజేపీ పార్టీలు తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర స్థాయిలో తనను దెబ్బతీయాలంటే తన పునాదులపై ఆ రెండు పార్టీలు భారీ స్కెచ్ వేశాయని అన్నారు. పేర్లు వేరైనా బీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై బుధవారం బీఎల్‌ఏలతో కొడంగల్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

కొడంగల్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు-కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతో రాష్ట్రానికి నాయకత్వానికి వహించే అవకాశం మనకు వచ్చిందన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో పొగ పెడితే తాను బయటకు రాకుండా ఉంటానని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తన ఎదురు నిలబడలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

 

ఓడించేందుకు బీజేపీ-బీఆర్ఎస్ కుట్రలు- కొడంగల్‌లో కుట్రలు చేసేవారిని బొంద పెట్టే బాధ్యత మీపై ఉందన్నారు ముఖ్యమంత్రి. ఆగస్టు 3 వరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ-SIR గడువు ఉందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,96,620 ఓట్లు ప్రక్షాళన అయ్యాయని, ఇంకా నమోదు చేసుకోనివారి సంఖ్య 54,635 ఓట్లు ఉన్నాయన్నారు. మొత్తం ఓట్లలో ఇంకా 22 శాతం నమోదు కాలేదన్నారు. ఆ ఓట్లను తొలగిస్తే ప్రమాదం పొంచి ఉందన్నారు.

 

ఓట్లు తొలగించేందుకు ఈ రెండు పార్టీల భారీ స్కెచ్-వారందరినీ తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు సీఎం. ఓటు పోగొట్టుకుంటే మనకు గుర్తింపు ఉండదని, కార్యకర్తగా ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ ఫారం నమోదు చేయించాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ-ఎస్టీ-మైనారిటీల ఓట్లు తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

 

ఓటర్ల వివరాలు ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపై ఉందని, ఈనెల చివరినాటికి నూటికి నూరు శాతం కొడంగల్ నియోజకవర్గంలో ప్రక్షాళన పూర్తి కావాలన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటరు కోల్పోవడానికి వీల్లేదన్నారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పని చేసినా తనకు సమయం సరిపోవడం లేదన్నారు.

 

ఓటరు జాబితాలో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావన్న సీఎం, గతంతో పోలిస్తే సరైన వివరాలు లేకపోతే పక్కన పెడుతున్నారని చెప్పుకొచ్చారు. అనుమానాస్పదంగా ఉంటే సరైన ఆధారాలు చూపి ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే రెడీ అవుతోందన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించేందుకు వీల్లేదన్నారు.

 

అంతకుముందు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన చేపట్టారు. తన నివాసం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లిన అక్కడ నిరసనలో పాల్గొన్నారు.

ANN TOP 10