AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్..!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నబీజేపీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా వల విసురుతోంది. “గులాబీ నేతలపై కమలం కన్ను” పడిందనే వార్తలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే సార్వత్రిక, శాసనసభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లోని కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఆ పార్టీని మరింత బలహీనపరచాలని బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపై కన్ను!

బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు కలిగిన గులాబీ నాయకులే ప్రధాన టార్గెట్‌గా మారినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో ఉంటూ రియల్ ఎస్టేట్, విద్య, వైద్య, కళాశాలలు, కాంట్రాక్టు రంగం, మైనింగ్ రంగాల్లో భారీగా బిజినెస్ నెట్‌వర్క్ కలిగిన ప్రజాప్రతినిధుల జాబితాను రూపొందించినట్లు సమాచారం. అందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మర్రి జానార్దన్ రెడ్డి, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి రెడ్డి , వెంకట్రాంరెడ్డి లాంటి ఉన్నట్లు సమాచారం. వీరు గాక బీఆర్ఎస్ పార్టీలోని కీలకనేతలు సైతం ఆ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. వారు పార్టీలో చేరాలని కోరడం, అందుకు నిరాకరిస్తే వారి వ్యాపారాలు, గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా విభాగాల ద్వారా విచారణల భయం చూపిస్తున్నారనే ఆరోపణలు గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల్లోఆందోళన రేకెత్తిస్తోంది.

 

మల్లారెడ్డి చేరికపై ఊహాగానాలు

ఈ వ్యూహాత్మక పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మేడ్చల్ మల్లారెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన విద్యాసంస్థలు , ఇతర బిజినెస్ నెట్‌వర్క్‌లపై గతంలో సాగిన విచారణలు, తాజాగా నమోదు అవుతున్న అంశాల నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే, ఈ వార్తలపై మల్లారెడ్డి లేదా బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ, అంతర్గతంగా చర్చలు తీవ్రస్థాయిలో సాగుతున్నట్లు తెలుస్తోంది.

 

సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా ‘స్పెషల్ నిఘా’

కేవలం మాజీ మంత్రులే కాకుండా, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా బీజేపీ స్పెషల్ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బలాబలాలు, వారి ఆర్థిక స్థితిగతులు, నియోజకవర్గంలో వారికి ఉన్న పట్టుపై బీజేపీ సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. పార్టీ మారేందుకు సిద్ధంగా లేని నాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, రాబోయే రోజుల్లో వారిని ఇరకాటంలో పెట్టేలా స్పీడప్ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం. సిట్టింగ్ లను చేర్చుకుంటే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, అధికారంలోకి వస్తామని కమలం కేంద్రనాయకత్వం ఇప్పటికే ఆపార్టీ సీనియర్ నేతలకు హింట్ ఇచ్చినట్లు సమాచారం.

 

ససేమిరా అంటున్న గులాబీ నేతలు!

బీజేపీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా తాము జెండా మారేది లేదని పలువురు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ లు ఇప్పటికే తెగేసి చెప్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా, రాజకీయ దాడులకు భయపడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోమని పేర్కొంటున్నారు. ఆర్థికంగా నిలకడగా ఉన్నప్పటికీ, రాజకీయ బెదిరింపులకు భయపడి జెండా మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు.కేసీఆర్ నాయకత్వంలోనే కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతున్నప్పటికీ, కమలనాథుల దూకుడుతో రాష్ట్ర రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయోనన్నది చూడాలి.

 

అర్బన్ గులాబీ నేతలపై ఆరా

బీజేపీ కి అర్బన్ ప్రాంతాల్లో పట్టుంది. మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడిరంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రజల్లో ఆదరణ ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లోని గులాబీ ఎమ్మెల్యేలు, మాజీలు, ప్రజాప్రతినిధులపై కమలం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గులాబీలో మొదటి నుంచి పదవులు రానీ, ఎమ్మెల్యే టికెట్ రానీ, యాక్టీవ్ గా ఉన్న సెకండ్ కేడర్ నేతలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. వారందరికి ఆఫర్లు సైతం ఇచ్చి పార్టీకి చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో తెలియదు.

ANN TOP 10