అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు, గనుల రంగం అభివృద్ధి, ఇతర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, కొత్త గనుల ఎక్స్ప్లోరేషన్, వనరుల సద్వినియోగం, గనుల రంగంలో పెట్టుబడులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
అస్సాంలో బొగ్గు, గనుల రంగానికి సంబంధించిన పలు అంశాలు, ఎదురవుతున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీసుకురాగా, వాటిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత సమస్యలను ప్రాధాన్యతతో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల సహకారంతో బొగ్గు, గనుల రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.








