మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచింది. ఇక్కడ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. బాధితులు చెప్పిన సమస్యలను ఓపికగా విన్న మంత్రి, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా.. మొత్తం 131 వినతులు మంత్రి నారాయణకు అందాయి.
ఎక్కువగా రెవెన్యూ వివాదాలే..
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గ్రీవెన్స్కు వచ్చిన 131 వినతుల్లో దాదాపు 100కు పైగా కేవలం రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయని తెలిపారు. అలాగే శాంతిభద్రతలు, పోలీసు శాఖకు సంబంధించి మరో 15 వినతులు రాగా, పెన్షన్ల కోసం వచ్చిన అర్జీలు చాలా స్వల్పంగా ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రెవెన్యూ అవకతవకలు, భూముల రికార్డుల తారుమారు వల్లే ఈరోజు సామాన్య ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నారాయణ విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ‘22A’ భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, ఈ సమస్యలన్నింటినీ సమూలంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందని స్పష్టం చేశారు.
అధికారుల పర్యవేక్షణ.. త్వరలోనే పరిష్కారం
గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి వినతిని తాము క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపుతున్నామని మంత్రి చెప్పారు. ఈ అర్జీలను వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, కమిషన్లతో పాటు ఆయా శాఖల మంత్రులకు పంపిస్తున్నామని తెలిపారు. కేవలం ఫైళ్లను పంపడమే కాకుండా, ఆయా అధికారులు నేరుగా బాధితులను సంప్రదించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ నాయకత్వం కూడా నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.








