దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు.
దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అరెస్టయిన వారిలో ఢిల్లీ, ముంబై, పంజాబ్కు చెందినవారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గత కొంతకాలంగా ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు, సరైన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉగ్ర ముఠాకు సరిహద్దు ఆవల నుంచి అందుతున్న సహకారం, నిధుల సమీకరణ, విదేశీ హ్యాండ్లర్ల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది.








