ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముగ్గురు వ్యక్తులపై చార్జిషీట్ దాఖలు చేసింది. శుక్రవారం విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ చార్జిషీట్ను సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
నిందితుల్లో నక్కా దేవిడ్ రాజ్ అలియాస్ డేవిడ్, విజయ్ విశ్వాస్లను మావోయిస్టు పార్టీ ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా (ఓజీడబ్ల్యూ) గుర్తించారు. వీరు పేలుడు పదార్థాలను అండర్గ్రౌండ్లో ఉన్న మావోయిస్టు కేడర్ సోడి కేసకు అందజేస్తుండగా స్థానిక పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులపై ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేశారు.
స్థానిక పోలీసుల నుంచి 2024 సెప్టెంబర్లో ఈ కేసును స్వీకరించిన ఎన్ఐఏ, దర్యాప్తులో కీలక విషయాలు కనుగొంది. భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు నిందితులు మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సేకరించి, రవాణా చేస్తున్నట్లు తేలింది. దేశ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించేలా ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను బలోపేతం చేయడమే ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఎన్ఐఏ తన దర్యాప్తులో పేర్కొంది. ఈ కేసులో మరిన్ని సంబంధాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.








