విశాఖపట్నంలో జరిగిన ఫ్రెస్మీట్లో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు అబద్దాలు, అభూతకల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చారని, రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అస్తిపంజరంగా మార్చేశారని మండిపడ్డారు.
హామీల వైఫల్యం.. పెరిగిన ధరలు
ఎన్నికల ముందు ఇచ్చిన‘ సూపర్ సిక్స్’ హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తుంగలోకి తొక్కిందని బొత్స విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలను నెలకు రూ. 1,500, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల ముచ్చటే లేదన్నారు. నిత్యా వసరాలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, గతంలో కోవిడ్ లాంటి కష్ట కాలంలో కూడా తాము సుపరిపాలన అందిస్తే, ఈ ప్రభుత్వం మాత్రం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేక యుద్ధం అంటూ సాకులు వెతుకుతోందని ఎద్దేవా చేశారు.
విద్యాశాఖలో గందరగోళం.. గీతం, ఏయూ వివాదం
మెగా డీఎస్సీ పాత విధానాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారాలపై పత్రికల్లో వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి తన శాఖను వదిలేసి వేరే విషయాలపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వ వర్గాలు గీతం సంస్థ భూములను దోచుకుంటున్నాయని , ఆంధ్ర యూనివర్సిటీని తాకట్టు పెట్టి మరీ గీతం అభివృద్థికి వాడుకుంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఇచ్చే కిట్లను కూడా సకాలంలో ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారని విమర్శించారు.
అవినీతి, పబ్లిసిటీ పిచ్చి
రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి అమరావతి వరకు విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని , అధికారులు, అధికార పార్టీ నేతలు కలిసి దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు. ప్రతీ మంగళవారం అప్పులు తెచ్చి అవినీతి పనులకే వాడుతున్నారని అన్నారు. పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రభుత్వానికి వేరే ధ్యాస లేదని, రెండేళ్లు దాటినా ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ వేసే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కంటే ఉత్తరాంధ్ర ప్రాంతమే అభివృద్ధికి అనుకూలమన్నది జగన్ గారి స్పష్టమైన అభిప్రాయమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
చంద్రబాబు మంత్రం.. ప్రజల పక్షాన పోరాటం
రాష్ట్రంలో ఉన్న పిల్లలకే ఉద్యోగాలు లేకపోతే, చంద్రబాబు జనాభాను పెంచాలని పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబులాగా రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు సంపాదించే మంత్రం ఏదో చెప్తే ప్రజలు కూడా నేర్చుకుంటారని బొత్స ఎద్దేవా చేశారు. పీ4 విధానం వల్ల ఎవరికీ మేలు జరగలేదన్నారు. వ్యవసాయాన్ని, ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని.. లీకేజీలు, అవినీతిపై ప్రశ్నించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. టీడీపీ అంటేనే మాయ, మోసం, దగా పార్టీ అని, ప్రజల పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగడతామని బొత్స హెచ్చరించారు.








