మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే జులై నెల నుంచి తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో భాగంగా తన నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి పునరాగమనం చేయడమే కాకుండా, త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అంతకుముందు తన నివాసంలో జరిగిన ఈడీ సోదాలపై ఆయన స్పందించారు. అధికారుల సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని, తన వద్ద ఏమీ దొరకలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అయితే, ఈడీ తనను విచారణకు పిలిచే అవకాశం ఉందని అన్నారు.







