AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీలోకి రాఘవ్ చద్దా..

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీలో చేరనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తనతో పాటు మూడింట రెండొంతుల మంది ఆప్ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో విలీనం కానున్నారని చెప్పడం సంచలనం సృష్టించింది.

 

ఈరోజు ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “15 ఏళ్లుగా ఆప్‌కు అంకితభావంతో పనిచేశాను. కానీ ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయతీ రాజకీయాలకు దూరమైంది. నేను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాను. అందుకే పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను” అని వ్యాఖ్యానించారు.

 

ఆప్‌కు రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, వారిలో మూడింట రెండొంతుల మంది తనతో పాటు బీజేపీ వైపు వస్తున్నారని చద్దా పేర్కొన్నారు. వీరిలో ప్రముఖ క్రీడాకారుడు హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ వంటి వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

 

గత కొంతకాలంగా పార్టీలో రాఘవ్ చద్దా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన్ను రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించారు. ఈ పరిణామం పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలోనే చద్దా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ నాయకత్వానికి ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది.

ANN TOP 10