ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కూటమి నేతలు వినూత్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. బీజేపీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఏప్రిల్ 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. అందులో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి అంశాలపై చర్చ జరిగింది. చట్ట సవరణ విషయంలో ఆయా బిల్లులు వీగిపోయాయి. ఈ బిల్లులకు ఏపీలో అధికార, విపక్షాలు మద్దతు ప్రకటించాయి.
మరి ఏం జరిగిందో తెలీదుగానీ బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
10 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ సభ్యులు హాజరవుతారా?
వారి నుంచి సానుకూలంగా స్పందన రావడంతో సమావేశాలకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మహిళా బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు వైఖరిని ప్రజలకు తెలియజేయాలన్నది అసలు ఉద్దేశంగా తెలుస్తోంది. సమావేశాల తర్వాత విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలలో భారీగా సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని ఎన్డీయే నేతల ఆలోచన. గతవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేతలు ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర భాగస్వామ్య పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబును బీజేపీ పెద్దలు కోరినట్టు తెలుస్తోంది. దానికి సీఎం చంద్రబాబు ఓకే చేయడంతో కీలక నిర్ణయం ప్రకటించారని పార్టీలో కొందరు నేతలు అంటున్నారు.
మరో 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో వీటిపై చర్చించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తొలి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏపీలో మూడు ప్రధాన నగరాల్లో భారీ సభలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ప్రతి ఎమ్మెల్యే తమతమ నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ అంశాన్ని వివరించాలని నేతలకు సూచించారు. ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతారా? చెప్పడం కష్టమేనని అంటున్నారు. ప్రభుత్వం చెప్పే అంశాలను మీడియా ముందు చెబితే సరిపోతుందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు








