అడవిని నమ్ముకుని.. పచ్చని ప్రకృతి ఒడిలో జీవించే గిరిపుత్రులకు బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గిరిజన పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా.. కేవలం పర్యాటకులను అడవికి తీసుకెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలను నగరానికి తీసుకొచ్చి ఇక్కడి చారిత్రక సంపదను చూపేలా వినూత్న ‘విజ్ఞాన యాత్ర’కు కసరత్తు చేస్తోంది.
ప్రభుత్వం ప్రణాళికలు
పర్యాటకరంగంపై ప్రభుత్వం దృష్టిసారించింది. పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు ఆకర్షితులయ్యేలా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగానే గిరిజన పర్యాటకానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. తొలి అడుగు ఆదిలాబాద్ నుంచే వేయబోతున్నట్లు సమాచారం. ఈ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లోని మారుమూల గూడాల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులను ఎంపిక చేసి.. వారిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మొదటి విడతలో సుమారు 200 మందికి ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.దీనికి పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
రూట్ మ్యాప్ సిద్ధం
గోల్కొండ కోట నుంచి సాగర్ తీరం వరకు ఆ గిరిజనులను తిప్పనున్నారు. ఒక రోజూ టూర్ కు తీసుకురాబోతున్నారు. హైదరాబాద్ చేరుకోనున్న ఆదివాసీలు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా పర్యాటక శాఖ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. కుతుబ్ షాహీల వైభవానికి సాక్ష్యమైన గోల్కొండ కోటను వారు సందర్శించనున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హుస్సేన్ సాగర్, అందులోని బుద్ధ విగ్రహం, ఆ పక్కనే ఉన్న లూంబిని పార్కులో లేజర్ షో తదితర ప్రాంతాలను చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు బిర్లా మందిర్, సాలార్ జంగ్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను కూడా ఈ పర్యటనలో చేర్చే అవకాశం ఉంది.ఈ యాత్రకు సంబంధించి రవాణా, భోజన, వసతి సౌకర్యాలపై పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం చేసి, రాష్ట్రంలోని ఇతర జిల్లాల గిరిజనులకు కూడా ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం
కేవలం వినోదం కోసమే కాకుండా, నగరం ఎలా ఉంటుంది? ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తోంది? వంటి అంశాలను వీరికి ప్రత్యక్షంగా వివరించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. సాధారణంగా విద్యార్థులకే పరిమితమయ్యే ఇలాంటి పర్యటనలను, ఇప్పుడు సామాన్య గిరిజనులకు కూడా వర్తింపజేయబోతున్నారు. త్వరలోనే ఎప్పుడు గిరిజనులను తీసుకొచ్చేఅంశంపై క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం. టూరిజం శాఖ అధికారికంగా వివరాలను వెల్లడించబోతున్నట్లు తెలిసింది.
ఇదే తొలిసారి..
గిరిజన కుటుంబాలను, సామాన్యులను పర్యాటక ప్రాంతాలకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ యాత్ర వల్ల అటవీ ప్రాంతానికే పరిమితమైన వారికి బయటి ప్రపంచంతో అనుబంధం ఏర్పడుతుందని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.








