ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర జీవ సంపద పరిరక్షణలో భాగంగా ఏటా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
సంతానోత్పత్తి కోసమే ఈ విరామం ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల మధ్య కాలం చేపలు, ఇతర సముద్ర జీవుల సంతానోత్పత్తికి అత్యంత కీలకమైన సమయం. ఈ నేపథ్యంలో సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఈ వేట విరామాన్ని ప్రకటిస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులు ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘించి వేటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5 వేల జరిమానాతో పాటు వారి వలలను స్వాధీనం చేసుకుని, బోటు రిజిస్ట్రేషన్ను ఏడాది పాటు రద్దు చేస్తారు.
చేపల వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం ఏప్రిల్ 17 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివరాల సేకరణ చేపట్టనున్నారు. ఇది కాకుండా వేటకు వెళ్లే బోట్లకు డీజిల్ సబ్సిడీ, రాయితీపై ఇంజిన్లు, వలలు, తెప్ప వంటి పరికరాలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. ముఖ్యంగా మోటార్ ఇంజిన్ల కొనుగోలుపై 40 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
భారీగా పెరిగిన బీమా సౌకర్యం మత్స్యకారుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని భారీగా పెంచారు. గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న ఈ బీమాను ఇప్పుడు రూ. 10 లక్షలకు పెంచారు. అలాగే, సాధారణ మరణం లేదా ప్రమాదం సంభవించినా కార్మిక శాఖ ద్వారా రూ. 2 లక్షల పరిహారం అందుతుంది. ఈ బీమా సౌకర్యాలు పొందాలంటే మత్స్యకారులు తప్పనిసరిగా సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. అలాగే, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు కలిగి ఉండి, మత్స్యశాఖ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం సమీపంలోని మత్స్యశాఖ కార్యాలయాలను లేదా గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.








