AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వయసు తగ్గుతున్న హీరోలు ఇద్దరే.. ఒకరు సూర్య, మరొకరు మహేశ్: త్రివిక్రమ్..

హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయోత్సవ వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి, హీరో సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ.. “కుటుంబ కథా చిత్రాల ప్రాముఖ్యతను ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ మరోసారి నిరూపించింది. తొలి రోజుతో పోలిస్తే వసూళ్లు రెట్టింపు కావడం సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇంతటి అద్భుతమైన కథను, పాత్రలను రూపొందించిన దర్శకుడు వెంకీ అట్లూరికి నా ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొన్నాడు

అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “భారతీయ చిత్ర పరిశ్రమలో వయసు తగ్గుతున్నట్లు కనిపించే అరుదైన కథానాయకులు ఇద్దరే ఉన్నారు. ఒకరు సూర్య, మరొకరు మహేశ్ బాబు. సూర్యతో సినిమా చేయాలని నా భార్య ఎప్పటి నుంచో కోరుతోంది. త్వరలోనే ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను. సూర్య, కార్తీ ఇప్పుడు భాషా, ప్రాంతీయ భేదాలు దాటి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు” అని కొనియాడాడు.

ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మామితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక బృందం నుంచి అద్భుతమైన సహకారం లభించిందని, సూర్య తన నటనా ప్రతిభతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించాడు. ఈ కార్యక్రమంలో రవీనా టాండన్, సునీల్ రెడ్డి, వైవా హర్ష, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10