AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుంపు మేస్త్రీ అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు..

హైదరాబాద్ నగరాభివృద్ధి ముసుగులో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధానంగా హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 35 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను విక్రయానికి పెట్టారని, అయితే ఆ నిధులను నగర అభివృద్ధికి వెచ్చించకుండా దారి మళ్లిస్తున్నారని ఆమె ఆరోపించారు. హెచ్‌ఎండీఏకు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా స్వయంగా ముఖ్యమంత్రే ఉన్నారని గుర్తు చేస్తూ, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన అనుచరుల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

 

ముఖ్యంగా టెండర్ల ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కారని కవిత ఆరోపించారు. గతంలో నామినేషన్ పద్ధతిలో జరిగిన పనుల కంటే, రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారు 1,140 కోట్ల రూపాయల కాంట్రాక్టులను అదే పద్ధతిలో అప్పగించారని, ఇది ఆర్థిక శాఖ నిబంధనలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. పారదర్శకమైన టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండికొట్టి, కేవలం అవినీతి కోసమే ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో సరికొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ పాలన ప్రస్తుతం ‘గుంపు మేస్త్రి’ చేతుల్లో చిక్కి మహా అవినీతికి నిలయంగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో గతంలో సిట్ వేయించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు అదే కాంట్రాక్టును ఎలా కొనసాగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

ANN TOP 10