తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఈరోజు కలిశారు. కేసీఆర్ ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకుని, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారులు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.
పాత మిత్రులు కలవడంతో అక్కడ ఎంతో ఆత్మీయ వాతావరణం నెలకొంది. కేసీఆర్ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే మీ దగ్గరికి పంపాడు, మీతో కలిసి పనిచేయమని కోరాడు” అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా కాలం తర్వాత ఇన్నాళ్లకు కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అంతకు ముందు, ఎర్రవెల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు.








