ప్రపంచ సాంకేతిక పటంలో ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా రాజధాని అమరావతికి కీలక స్థానం కల్పించే దిశగా మరో చరిత్రాత్మక అడుగు పడుతోంది. నవశకం టెక్నాలజీ అయిన క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన స్వదేశీ క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏప్రిల్ 14న ప్రారంభించనున్నారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రావడంతో, దేశంలో క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ కేంద్రాన్ని కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది.
గన్నవరంలోని మేధా టవర్స్లో ‘అమరావతి 1Q’ పేరుతో, రాజధాని పరిధిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ‘అమరావతి 1S’ పేరుతో రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని విద్యార్థులు, పరిశోధకుల కోసం ‘ఓపెన్ యాక్సెస్’ ప్రాతిపదికన అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా వారు క్వాంటం కంప్యూటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించి, పరిశోధనలు చేసేందుకు వీలు కలుగుతుంది. మూడు దశాబ్దాల క్రితం ఐటీ విప్లవంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన చంద్రబాబు, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీతో ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారు.
హార్డ్వేర్ తయారీకి కేంద్రంగా అమరావతి
కేవలం సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్కే పరిమితం కాకుండా క్వాంటం కంప్యూటర్ల హార్డ్వేర్ తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఈ ఆశయ సాధనలో భాగంగానే అమరావతిలో ఈ టెస్టింగ్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద పనిచేసే ఈ కేంద్రాల్లో, క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను పరీక్షించి, సర్టిఫికేషన్ ఇస్తారు.
ఇటీవలే 30కి పైగా క్వాంటం హార్డ్వేర్ తయారీ సంస్థలతో సీఎం సమావేశమై, అమరావతిని దేశ క్వాంటం హార్డ్వేర్ నెట్వర్క్కు యాంకర్ నోడ్గా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. క్రయోజెనిక్స్, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో స్వదేశీ ఉపకరణాల తయారీకి ఈ కేంద్రం ఊతమివ్వనుంది.
గ్లోబల్ హబ్గా క్వాంటం వ్యాలీ
అమరావతిని ప్రపంచంలోని మొదటి 5 క్వాంటం హబ్లలో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల్లో ‘అమరావతి క్వాంటం వ్యాలీ (AQV)’ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం భాగస్వామ్యంతో 133 క్యూబిట్ సామర్థ్యమున్న శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది. టీసీఎస్, ఎల్ అండ్ టీ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయి.
నూతన ఔషధాల ఆవిష్కరణ, వాతావరణ అంచనాలు, సెమీ కండక్టర్ల డిజైన్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక పరిశోధనలకు ఈ కేంద్రం వేదిక కానుంది. ఇప్పటికే 80కి పైగా అంతర్జాతీయ సంస్థలు, వర్సిటీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. క్వాంటం నైపుణ్యాల కల్పనలో భాగంగా ఐదేళ్లలో 45 లక్షల మంది నిపుణులను తయారు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.








