పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు వారి వయసుకు తగిన కంటెంట్ను మాత్రమే అందుబాటులో ఉంచేలా విధివిధానాలు రూపొందించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా మహిళల పట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పిల్లల డిజిటల్ భద్రతకు సంబంధించి ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు లోకేశ్ సూచించారు. వయసు నిర్ధారణ కోసం డిజిలాకర్తో అనుసంధానించిన ‘ఏజ్ టోకెన్’ విధానంపై దృష్టి సారించాలని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ రోజున విద్యార్థులకు, పీటీఎం సమావేశాల్లో తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తామని వివరించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు… సున్నితమైన కంటెంట్ను పిల్లలకు దూరంగా ఉంచేందుకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యాచరణకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








