AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష…

రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు భూ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తూ, వారి ఆస్తులకు పూర్తి భద్రత కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న అనేక రెవెన్యూ వివాదాలకు చరమగీతం పాడుతూ, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేసింది. బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో, లక్షలాది కుటుంబాలకు వరంగా మారే కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

రీసర్వే 2.0కు పక్కా ప్రణాళిక

గత ప్రభుత్వ హయాంలోని రీసర్వే అస్తవ్యస్తంగా మారిందని, దానిని సరిదిద్దేందుకు ‘రీసర్వే 2.0’ను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. 2027 మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, రాష్ట్రంలోని 1.12 కోట్ల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

 

ఇప్పటివరకు సర్వే పూర్తయిన 6,976 గ్రామాల్లో 5,717 గ్రామాలకు సంబంధించి 22.79 లక్షల పాసు పుస్తకాల పంపిణీ జరుగుతోందని అధికారులు వివరించారు. మిగిలిన 1,259 గ్రామాల్లోని 9 లక్షల పాసు పుస్తకాలను ఈ ఏడాది జూలై నాటికి అందించాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 80 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూడాలని గట్టిగా సూచించారు.

 

ఇనాం భూములకు విముక్తి

రాష్ట్రంలో ఏళ్ల తరబడి సంక్లిష్టంగా మారిన ఇనాం భూముల సమస్యకు చంద్రబాబు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22ఏ) నుంచి తొలగిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఇతర సర్వీస్ ఇనాంల పరిధిలోని మరో లక్ష ఎకరాల భూములకు కూడా విముక్తి కల్పించేందుకు వీలుగా కొత్త చట్టం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

 

2019లో టీడీపీ ప్రభుత్వం దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది కుటుంబాలు నష్టపోయాయని, వారికి న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

75 లక్షల కుటుంబాలకు ఆస్తి హక్కు

పేద, మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట కల్పిస్తూ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం ప్రకటించారు. 2016కు ముందు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల్లో ఇంటి పట్టా పొందిన సుమారు 75 లక్షల కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించాలని ఆదేశించారు.

 

ఈ నిర్ణయంతో లబ్ధిదారులు తమ ఇళ్లను అమ్ముకునేందుకు, బహుమతిగా ఇచ్చేందుకు లేదా రుణాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది లక్షలాది పేద కుటుంబాలకు నిజమైన ఆస్తిగా మారనుంది. అలాగే, రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ కింద ఉన్న 13.59 లక్షల ఎకరాల్లో అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలకు త్వరలో పూర్తి హక్కులు కల్పించనున్నారు.

 

భూ రికార్డులకు బ్లాక్‌చెయిన్ భద్రత

ప్రజల ఆస్తులకు పటిష్టమైన రక్షణ కల్పించేందుకు సాంకేతికతను వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ రికార్డును డిజిటలైజ్ చేసి, భూ యజమాని మొబైల్‌కు సాఫ్ట్ కాపీ పంపాలని ఆదేశించారు. ఈ-కేవైసీ పూర్తి చేసిన తర్వాత రికార్డులను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రపరచాలని సూచించారు. దీనివల్ల యజమాని ఆధార్, ఈ-కేవైసీతో తమ రికార్డులను లాక్ చేసుకోవచ్చు. యజమానికి తెలియకుండా భూ లావాదేవీలు జరగకుండా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

 

ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీసీఎల్ఏ జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ANN TOP 10