ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకుల భార్యలను ఉద్దేశించి రాధాకృష్ణ అత్యంత అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించారని, ఇది మహిళలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు కేవలం విమర్శ కాదని, మహిళల ఆత్మగౌరవంపై చేసిన దాడిగా భావించాలని ఆయన అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.
జగన్ ట్వీట్ ఇదే…!
“రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైసీపీలో ఉన్నారు!” అంటూ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వ్యాఖ్యానించారు. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం, వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదు.
ఆ వ్యాఖ్యలు మహిళలను అవమాన పరచడమే కాకుండా, వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. ఎలాంటి వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్నదానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మహిళలను అవమానించడానికే కాదు, ప్రజల్లో ‘మావిగన్ (MAVIGUN)’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం.








