AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇరాన్‌తో యుద్ధంలో మేం పూర్తిగా గెలిచాం: ట్రంప్..

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా “పూర్తిగా గెలిచింది” అని, ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని దాదాపు నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే, తదుపరి చర్యలకు ముందు చర్చల కోసం టెహ్రాన్‌కు 10 రోజుల గడువు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ఫోన్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

అమెరికా సైనిక చర్యలతో ఇరాన్ యుద్ధం చేసే సత్తాను కోల్పోయిందని ట్రంప్ అన్నారు. “మేం ఇప్పటికే యుద్ధం గెలిచాం. సైనికపరంగా ఇరాన్‌ను పూర్తిగా ఓడించాం” అని స్పష్టం చేశారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేనను దెబ్బతీశామని, చాలా వరకు క్షిపణులను, వాటి ప్రయోగ వ్యవస్థలను, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను కూడా ధ్వంసం చేశామని ఆయన వివరించారు. ఇరాన్ నాయకత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొన్నారు.

 

అయితే, ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఇరాన్ అభ్యర్థన మేరకే తదుపరి దాడులను వాయిదా వేసినట్లు ట్రంప్ తెలిపారు. “చర్చల కోసం మరికొంత సమయం కావాలని వాళ్లు నన్ను అడిగారు. అందుకే నేను వారికి 10 రోజుల గడువు ఇచ్చాను” అని ఆయన చెప్పారు. ప్రస్తుతం చర్చలు సజావుగానే సాగుతున్నాయని కూడా పేర్కొన్నారు. ఈ చర్చల్లో ఒప్పందం కుదరకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. “వారు చేయాల్సిన పని చేయకపోతే, నేను వారి పవర్ ప్లాంట్లను నాశనం చేస్తాను” అని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

 

ఇరాన్ వంటి శత్రు దేశాలు అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు. “ఒక ఉన్మాది లేదా పిచ్చి సిద్ధాంతం చేతిలో అణ్వాయుధం ఉండటానికి వీల్లేదు” అని అన్నారు. అమెరికా కనుక దాడి చేయకపోయి ఉంటే, ఈపాటికి ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించి, దానిని ఉపయోగించి కూడా ఉండేదని అభిప్రాయపడ్డారు. తన చర్యలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచంలోనే తమది అత్యంత శక్తివంతమైన సైన్యమని, తమకు ఎవరూ సాటిరారని ట్రంప్ పునరుద్ఘాటించారు.

 

ANN TOP 10