రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల కోసం భారీ స్థాయిలో వైద్య సదుపాయాలు సిద్ధమయ్యాయి. అటవీ ప్రాంతంలో జరిగే ఈ మహా జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే చికిత్స అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జాతరకు వచ్చే అన్ని ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ముఖ్యంగా మేడారంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకల సామర్థ్యంతో ఒక ప్రధాన ఆసుపత్రిని, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లను ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొత్తం 30 మెడికల్ క్యాంపులను నెలకొల్పారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను వరంగల్ లేదా హన్మకొండకు తరలించేందుకు 35 అంబులెన్సులను సిద్ధంగా ఉంచడంతో పాటు, నిరంతర పర్యవేక్షణ కోసం వైద్య బృందాలకు వైర్లెస్ సెట్లను కూడా అందజేశారు.
ఈ భారీ వైద్య సేవల నిర్వహణ కోసం ప్రభుత్వం మొత్తం 3,199 మంది సిబ్బందిని విధుల్లో నియమించింది. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది షిఫ్టుల వారీగా పనిచేస్తారు. మందుల కొరత లేకుండా ముందస్తుగా బఫర్ స్టాక్ను సిద్ధం చేయడమే కాకుండా, అత్యవసర సమయాల్లో అంబులెన్సుల కదలిక కోసం పోలీసుల సమన్వయంతో ‘గ్రీన్ ఛానెల్’ మార్గాలను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.









