ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని తాను బలంగా విశ్వసించానని, కానీ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురిచేశాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. “కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి, “డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం అత్యంత అనుచితం” అని హితవు పలికారు.
పవన్ వ్యాఖ్యలపై తన బాధను వ్యక్తం చేస్తూ, “నేను సీఎం అవుతాడని నమ్మిన వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరం” అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా ఆయన విమర్శలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న చంద్రబాబు… తన సొంత వ్యాపారాలను, నివాసాన్ని ఆంధ్రప్రదేశ్కు ఎందుకు మార్చడం లేదని ఉండవల్లి నిలదీశారు.
రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేవలం వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే ఏర్పడి విజయం సాధించిందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఈ పొత్తు కేవలం అధికారం కోసం ఏర్పడిందని పరోక్షంగా సూచిస్తూ, ఈ కూటమి ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.









