తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్పేట – ముచ్చర్ల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్సిటీ’కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. **’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047’**కి ఈ భావి నగరం ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ మెగా సదస్సును ఇక్కడే ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరంగా దీనిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
ఈ ఫ్యూచర్సిటీకి అత్యాధునిక మౌలిక వసతులు, అద్భుతమైన కనెక్టివిటీ కల్పిస్తున్నారు. ఈ నగరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేవలం 33 కి.మీ దూరంలో ఉంది. మెరుగైన రవాణా కోసం కొత్తగా 41 కి.మీ. మేర గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ గ్లోబల్ సదస్సు వేదికను మీర్ఖాన్పేటలో అమెజాన్ డేటా కేంద్రానికి ముందే ఏర్పాటు చేయగా, ఇక్కడికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ నగరంలో నిరంతర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) ని కూడా ఏర్పాటు చేశారు.
‘భారత్ ఫ్యూచర్సిటీ’లో అధునాతన సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాలు నిర్మాణంలో ఉండగా, త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విశ్వవిద్యాలయం మరియు పరిశోధన, ఇంక్యుబేషన్ కేంద్రాలు రాబోతున్నాయి. వీటితో పాటు పారిశ్రామిక పార్కులు, ఐటీ, ఫార్మా సంస్థలు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల కార్యకలాపాలు, అలాగే వారాంతపు ఆటవిడుపు కోసం గేమింగ్ జోన్లు, వినోద కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.









