AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలకృష్ణ తొలి పాన్-ఇండియా చిత్రం ‘అఖండ 2’: ఉత్తరాదిలో చరిత్ర సృష్టిస్తాడా?

నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలవుతుండగా, రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లోనే తొలి పాన్-ఇండియా సినిమా కావడం, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుండటంతో ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతంలో విడుదలైన ‘అఖండ’ మొదటి భాగం కేవలం తెలుగులోనే విడుదలై సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా దాని హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధించడంతో, ‘అఖండ 2’ ను పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బాలయ్య స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పడం, బాలీవుడ్ నటులను భాగం చేయడం వంటి ప్రత్యేక వ్యూహాలను అనుసరించారు. సనాతన ధర్మం, శివతత్వం, అఘోరాల నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం, హిందీలో ఇటీవల విజయం సాధించిన ‘కాంతార 2’ వంటి చిత్రాల కోవలోకి వస్తుందని చిత్రబృందం నమ్ముతోంది.

ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ వంటి సీనియర్ స్టార్లు పాన్-ఇండియా స్థాయిలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో, ‘అఖండ 2’ విజయం బాలకృష్ణకు అత్యంత కీలకం. ఈ సినిమా గనుక హిట్టయితే, పాన్-ఇండియా మార్కెట్‌ను జయించిన తొలి సీనియర్ టాలీవుడ్ హీరోగా బాలయ్య సరికొత్త రికార్డు సృష్టిస్తారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ANN TOP 10