హైదరాబాద్లోని హయత్నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ, ఈ వార్తను తెలుసుకుని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి, బాలుడికి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
గాయపడిన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కమిషనర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అవసరమైన తక్షణ సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా, నగరంలో వీధి కుక్కల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అధికారులను గట్టిగా ఆదేశించారు.









