తొలిసారిగా నిర్వహించిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు అజేయంగా నిలవడం మరింత ప్రశంసనీయమని, ఈ విజయం దేశానికి గర్వకారణమని కొనియాడారు.
ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ విజయం క్రీడాకారుల కృషి, పట్టుదల, అకుంఠిత స్ఫూర్తికి ఒక గొప్ప నిదర్శనమని ప్రశంసించారు. జట్టులోని ప్రతి క్రీడాకారిణి ఒక ఛాంపియన్ అని పేర్కొన్నారు. క్రీడాకారుల అద్భుతమైన ప్రతిభను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ ఘనత రాబోయే తరాలకు, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ తన సందేశంలో తెలిపారు. భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించారు.









