తిరుమలలో కల్తీ నెయ్యి వాడకంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వంపై, అప్పటి టీటీడీ బోర్డుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. గత ఐదేళ్ల పాలనలో కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని, వారి పవిత్రమైన నమ్మకానికి ద్రోహం చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీటీడీ బోర్డు భక్తుల మనోభావాలను గాయపరిచిందని మండిపడ్డారు.
“తిరుమల కేవలం ఆలయం కాదు, అది మన భక్తికి మూలం. ప్రగాఢ విశ్వాసంతో మనమంతా అక్కడికి వెళతాం. కానీ గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు, అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారు. మన భక్తిని వారు ఒక అవకాశంగా చూశారు” అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతి భక్తుడు మోసపోయాడని ఆయన అన్నారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 10.97 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పవన్ గుర్తుచేశారు. సామాన్యుల నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు అందరూ దర్శించుకునే పవిత్ర క్షేత్రంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన పవిత్రమైన నమ్మకాన్ని వారు పూర్తిగా విచ్ఛిన్నం చేశారని పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.









