బాలీవుడ్ ప్రముఖ జంట విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ దంపతులు తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులయ్యారు. ఈ శుభవార్తను వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ, “మా జీవితంలో ఆనందం రెట్టింపు అయింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా మగబిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాము” అని భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ శుభవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే, ఈ శుభ సందర్భంలోనే ఓ ప్రముఖ జ్యోతిష్కుడిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో అనిరుధ్ కుమార్ మిశ్రా అనే జ్యోతిష్కుడు కత్రినా-విక్కీ జంటకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుడుతుందని జోస్యం చెప్పారు. అప్పట్లో ఈ జోస్యం వార్తలలో నిలిచింది. కానీ ఇప్పుడు వారికి మగబిడ్డ జన్మించడంతో, ఆ జ్యోతిష్కుడి అంచనా పూర్తిగా తప్పిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.
కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన దాదాపు నాలుగేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. సినిమాల విషయానికొస్తే, విక్కీ కౌశల్ ఇటీవల ‘ఛావా’ చిత్రంతో విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తున్నారు. కత్రినా కైఫ్ చివరిసారిగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మెర్రీ క్రిస్మస్’ చిత్రంలో కనిపించారు.









