తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ (BRS) అగ్రనేత కేటీఆర్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ వీరిద్దరినీ ‘బ్యాడ్ బ్రదర్స్’గా అభివర్ణించారు. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ వంటి ముఖ్య ప్రాజెక్టులను ఈ ‘బ్యాడ్ బ్రదర్స్’ కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు వీరిద్దరినీ అభివృద్ధి నిరోధకులుగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ.. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్టులను తీసుకొచ్చి నగరాన్ని గ్రోత్ ఇంజిన్గా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, గతంలో టీడీపీ ప్రభుత్వ సహకారం కూడా ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణను రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. అంతేకాకుండా, రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని, ఈ సొమ్మును గోదావరిలో పోశారని తీవ్రంగా ఆరోపించారు.
హైదరాబాద్ వరదల్లో మునిగిపోయినప్పుడు కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన కిషన్రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని సీఎం ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం, ప్రగతి భవన్ నిర్మాణాలు కేసీఆర్ కుటుంబం కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని గణాంకాలు వివరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.









