ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో నవంబర్ 2న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఆస్ట్రేలియా లాంటి పటిష్ఠమైన జట్టును సెమీస్లో చిత్తు చేసి కాన్ఫిడెంట్గా ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన, చరిత్రలో తొలిసారి ఫైనల్కు వచ్చిన సఫారీ జట్టుతో ఢీ కొట్టనుంది. ఈ బిగ్ మ్యాచ్లో గెలిచేందుకు సెమీఫైనల్లో ఆడిన విన్నింగ్ కాంబినేషన్ను మార్చాల్సిన అవసరం లేదని మాజీ సారథి అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది.
సెమీస్లో గెలిచిన జట్టునే ఫైనల్లో కొనసాగించడానికి ప్రధాన కారణం, ఆ మ్యాచ్లో చేసిన మార్పులు టీమ్కు కలిసి రావడమే. సౌత్ ఆఫ్రికా జట్టు ఈ టోర్నమెంట్లో స్పిన్ బౌలింగ్లో ఎక్కువగా వికెట్స్ కోల్పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు (రాధా యాదవ్, శ్రీ చరణి)ని ఆడించడం సరైన వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ కూడా సెమీఫైనల్ కాంబినేషన్తోనే బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ టీమ్ కాంబినేషన్ ఐదుగురు బ్యాటర్స్, నలుగురు బౌలర్స్, ఇద్దరు ఆల్రౌండర్లతో చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాటింగ్ లైనప్లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, ఫినిషర్ రోల్లో రిచా ఘోష్ ఉన్నారు. బౌలింగ్ అటాక్లో దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి రూపంలో ముగ్గురు స్పిన్నర్స్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్లతో ఇద్దరు పేసర్స్ ఉన్నారు. సెమీస్లో జెమీమా రోడ్రిగ్స్ సెంచరీ, స్పిన్నర్ల కీలక పాత్ర ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్.









