గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా, బీఆర్ఎస్ మాగంటి సునీతకు, కాంగ్రెస్ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చాయి. నామినేషన్ల పర్వం మొదలైనా బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై గందరగోళం నెలకొన్న సమయంలో రాజాసింగ్ ఈ విమర్శలు చేశారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుందని రాజాసింగ్ ఘాటుగా ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తారా లేక కాంగ్రెస్ను గెలిపిస్తారా అంటూ తెలంగాణ సమాజం, నెటిజన్లు మిమ్మల్ని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్ర పెద్దల ముందు ముఖం ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తూ, కిషన్ రెడ్డి గౌరవం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు.
అంతేకాక, “ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం, ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్, ప్రతి డివిజన్లో వేలు పెట్టే అలవాటు మీకు ఉంది… కానీ ఈసారి జూబ్లీహిల్స్లో చాలామంది వేలు పెడుతున్నారు” అని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, “నా జిల్లాను సర్వనాశనం చేసి.. నన్ను బీజేపీ పార్టీ నుంచి బయటికి పంపించారు.. ఒక రోజు మీరు కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొవచ్చని” కిషన్ రెడ్డిని రాజాసింగ్ తీవ్రంగా హెచ్చరించారు. అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతున్న వేళ రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీని మరింత ఇరుకున పెట్టాయి.