AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే వారికి మాట్లాడేందుకు సమయం ఇస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక సూచన చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు శాసనసభ ఒక సరైన వేదిక అని, దానిని ఉపయోగించుకోవాలన్నారు.

 

అనకాపల్లిలో నిన్న పర్యటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో యూరియా కొరతపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసలు నిజాలను అసెంబ్లీలో చెప్పేందుకు వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలకు అవగాహన కలిగించేందుకు శాసనసభను వేదికగా వాడుకోవాలి కానీ, బహిరంగంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు.

 

అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకూ సమానంగా సమయం కేటాయిస్తామని స్పష్టం చేసిన ఆయన, “అసెంబ్లీ వేదికపై వాదనలకు, చర్చలకు తావుంది. ప్రజల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించేందుకు ఇది ఉత్తమమైన అవకాశమని నేను భావిస్తున్నాను. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశాలకు హాజరై సవాలులను సభలో ఎదుర్కొనాలి,” అని అన్నారు.

 

ఇటీవల వైసీపీ నాయకత్వం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, వర్షాకాల సమావేశాలు సుదీర్ఘంగా సాగే అవకాశముంది. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్, ఉద్యోగ భద్రత, గిరిజన ప్రాంతాల్లో సమస్యలు, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు చర్చకు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ANN TOP 10