ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. “జగన్ గారూ.. మీ ఏడుపులే మాకు దీవెనలు” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. తాము చేపడుతున్న సంస్కరణలు చూసి ఓర్వలేకే జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది… అందుకు ఏపీఈసెట్ అడ్మిషన్లే నిదర్శనం అని జగన్ చేసిన విమర్శలకు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
“మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం. మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తరువాత 2022 సెప్టెంబర్లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాం” అని లోకేశ్ వివరించారు.