హైదరాబాద్లోని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ‘మహా న్యూస్’ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడికి సంబంధించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆదివారం అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, ఆయన అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బాల్క సుమన్పైనా కేసు నమోదు చేశారు.
పోలీసుల విధులకు ఆటంకం
శనివారం జూబ్లీహిల్స్లోని మహా న్యూస్ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు వెళ్లారు. ఆ సమయంలో మధుసూదనాచారి, బాల్క సుమన్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపై మరో కేసు నమోదు చేశారు. దాడి ఘటనలో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
దాడిని ఖండించిన కాంగ్రెస్
ఈ దాడిని అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించి, జర్నలిస్టులు, సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. తమ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పాపం బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం లేదని, ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
“రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా, వారి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, మహిళా అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. దీనివల్ల ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారు,” అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉందని, తమపై పెయిడ్ ఛానళ్లలో ఎన్నో వ్యతిరేక కథనాలు వచ్చినా తాము ఎప్పుడూ భౌతిక దాడులకు దిగలేదని ఆయన స్పష్టం చేశారు. కేటీఆరే స్వయంగా గూండాలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జర్నలిస్టుల ముసుగులో… అంటూ కేటీఆర్ సోషల్ మీడియా పోస్ట్
దాడి జరగడానికి ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సదరు ఛానల్ ప్రసారం చేసిన ఒక బులెటిన్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. “జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొందరు నీచులు గత కొన్ని నెలలుగా నాపైనా, మా పార్టీ నాయకత్వంపైనా విషం చిమ్ముతున్నారు. వారి అభిప్రాయాలను నేను పట్టించుకోను. కానీ, పదేపదే వ్యక్తిత్వ హననానికి పాల్పడటం నా కుటుంబం, స్నేహితులు, పార్టీ శ్రేణులను బాధిస్తోంది. ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఈ వ్యవస్థీకృత దాడుల వెనుక ఎవరున్నారో నాకు బాగా తెలుసు, వారితో తగిన రీతిలో వ్యవహరిస్తాను” అని కేటీఆర్ తన పోస్టులో హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే దాడి జరగడం గమనార్హం.