ఇటీవల ప్రమాదానికి గురైన ఏఐ171 విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్), డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డిఎఫ్డిఆర్)లను విశ్లేషణ కోసం విదేశాలకు పంపుతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టత ఇచ్చింది. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పింది.
“ప్రమాదానికి గురైన ఏఐ171 విమానం నుంచి సేకరించిన సివిఆర్/డిఎఫ్డిఆర్లను విశ్లేషణ కోసం విదేశాలకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఫ్లైట్ రికార్డర్లను ఎక్కడ డీకోడ్ చేయాలనే దానిపై అన్ని సాంకేతిక, భద్రతాపరమైన అంశాలను క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాతే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నిర్ణయం తీసుకుంటుంది,” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇలాంటి సున్నితమైన విషయాలపై ఎలాంటి ఊహాగానాలకు తావివ్వవద్దని, దర్యాప్తు ప్రక్రియను నిబద్ధతతో, వృత్తి నైపుణ్యంతో కొనసాగేందుకు సహకరించాలని అన్ని వర్గాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కోరింది.
విమానం కూలిపోయిన మరుసటి రోజు, అంటే జూన్ 13న, ప్రమాద స్థలం నుంచి సివిఆర్, డిఎఫ్డిఆర్లు కలిగిన ఒక యూనిట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జూన్ 16న మరో సెట్ను కూడా కనుగొన్నారు. ఈ తరహా విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్ సెట్లు ఉంటాయని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు విషయంలో పూర్తి పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని, ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిర్దేశిత నియమ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు స్థానిక అధికారులు, ఏజెన్సీల పూర్తి సహకారంతో స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది. ప్రమాద స్థలంలో డాక్యుమెంటేషన్, ఆధారాల సేకరణ వంటి కీలక పనులు పూర్తయ్యాయని, తదుపరి విశ్లేషణ జరుగుతోందని వివరించింది.