AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్ట్: పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న నిందితులు!..

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేతన్ ను లోహగఢ్ కోటపై నుంచి తోసేసి చంపిన కేసులో నిందితురాలైన అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ ప్లాన్ అంతా అవతలి వ్యక్తిదేనంటూ పోలీసుల విచారణలో పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

 

రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట లోయలో పడి మరణించాడు. మొదట దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించినప్పటికీ.. పోలీసుల లోతైన విచారణలో ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా తేలింది. తమ బంధానికి అడ్డంగా ఉన్నాడనే కారణంతో సియా, చేతన్ కలిసి కేతన్‌ను అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు.

 

పోలీసుల విచారణలో వీరిద్దరూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అయితే, ఈ హత్యాకాండకు సియా గోయల్ ప్రధాన సూత్రధారి కాగా, కేతన్‌ను లోయలోకి నెట్టడంలో చేతన్ సహకరించినట్లు ఆధారాలు లభించాయి. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కేతన్‌కు సియా చెప్పినప్పటికీ, అతడు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి నిరాకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అంతకుముందు నాలుగు రోజుల క్రితమే ఒకసారి కేతన్‌ను నెట్టేయడానికి ప్రయత్నించగా అతడు బతికిపోయాడని, అప్పట్లో అక్కడ పాము ఉందంటూ సియా నమ్మించిందని దర్యాప్తులో తేలింది.

 

ఘటనకు కొన్ని గంటల ముందు వీరిద్దరూ ఒక కేఫ్‌లో కలిసి ప్లాన్ పూర్తి చేశారని, కిల్లర్ లుక్ కోసం 33 డిగ్రీల ఎండలో కూడా చేతన్ హుడీ ధరించాడని పోలీసులు గుర్తించారు. కోటపై సియా కింద కూర్చోవడమే సంకేతంగా భావించి, కేతన్‌ను చేతన్ లోయలోకి నెట్టేసినట్లు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ద్వారా ఆధారాలు సేకరించారు.

 

కేతన్ మృతదేహాన్ని చూసినప్పుడు సియా ఎలాంటి చలనం లేకుండా ఉండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మలుపు తిరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ ఏడు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ ఘోరంపై సియా తల్లిదండ్రులు స్పందిస్తూ.. “నా కూతురు తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించండి, అవసరమైతే ఉరి తీయండి” అని పేర్కొన్నారు. చేతన్ తండ్రి మాత్రం తన కొడుకును అన్యాయంగా ఇరికించారని వాదిస్తున్నారు.

ANN TOP 10