వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిన్న పర్యటించిన విషయం విదితమే. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించాయి. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పర్యటన సాగింది.
జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా, ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ తెలిపారు. పోలీసులపై ప్రజా ప్రతినిధులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడ్డాయని, ప్రజా ప్రతినిధులు సైతం వారి అనుచరులతో తిరిగారని పేర్కొన్నారు.
వైసీపీ ఉల్లంఘనలపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఎస్పీ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, జగన్ పర్యటనలో నిబంధనల ఉల్లంఘనపై వైసీపీ నేతలపై ఒకటి రెండు రోజుల్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.