సినీ నటి సమంత తన తాజా ఇంటర్వ్యూలో జీవితం, విజయం, వ్యక్తిగత ఎదుగుదలపై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం తాను మానసికంగా ఎంతో దృఢంగా, సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్న సమంత, ప్రస్తుతం తన కెరీర్పై పూర్తి దృష్టి సారించారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, “కీర్తి ప్రతిష్టలకు అతీతంగా, స్వేచ్ఛగా జీవితాన్ని గడపడమే నిజమైన విజయమని నేను భావిస్తున్నాను. గత రెండేళ్లుగా నేను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ విరామంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, వ్యక్తిగతంగా ఎంతో సాధించాను. జీవితంలో ఒకే వృత్తానికి పరిమితం కాకుండా స్వేచ్ఛగా వృద్ధిలోకి రావడం, పరిణితి సాధించడం అన్నింటికంటే ముఖ్యం” అని వివరించారు.
తనకు రెండేళ్లుగా విజయాలు లేవని చాలా మంది అనుకోవచ్చని, కానీ గతంలో కంటే ఇప్పుడు తాను మెరుగ్గా ఉన్నానని సమంత పేర్కొన్నారు. “ప్రతి రోజూ ఉత్సాహంగా నిద్రలేస్తున్నాను. నా జీవితాశయం దిశగా స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడే నేను ఉన్నతమైన విజయాలను ఆస్వాదిస్తున్నాను” అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు, హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్లో కూడా కనిపించనున్నారు.