AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మార్కెట్లోకి ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం.. !

ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నిజమైంది. రాష్ట్రంలోనే వెలికితీసిన ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గనుల నుంచి జియో మైసూర్ సంస్థ ఉత్పత్తి చేసిన బంగారు బిస్కెట్లను అమ్మకానికి ఉంచారు. ఈ చారిత్రక ఘట్టంతో కర్నూలు జిల్లా పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగుతోంది.

 

ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఈ బిస్కెట్లపై ఏపీ మ్యాప్‌తో పాటుగా ‘జొన్నగిరి గోల్డ్‌మైన్స్’ అనే పేరును ముద్రించారు. బంగారం స్వచ్ఛతను తెలియజేసేలా ‘999’ నంబర్‌ను కూడా వేశారు. ఇది 24 క్యారెట్ల అత్యంత స్వచ్ఛమైన బంగారమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 500 గ్రాముల బిస్కెట్ విలువ సుమారు రూ.75 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. ప్రస్తుతం కర్నూలులోని షరాఫ్ బజార్లో కొందరు వ్యాపారుల వద్ద ఈ బంగారు బిస్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

 

ఈ నెల‌ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జియో మైసూర్-జొన్నగిరి గోల్డ్‌ మైన్స్‌ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలోనే జొన్నగిరి గనుల్లో ఉత్పత్తి అయిన తొలి బంగారాన్ని కర్నూలుకు చెందిన ప్రముఖ బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీశ్‌, చక్రవర్తి, శ్రీహరిమూర్తి తదితరులు కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా స్వయంగా ‘మేడిన్ ఆంధ్ర’ బంగారం అందుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. వీరిలో ఓ వ్యాపారి ఇప్పటికే ఒక గోల్డ్ బిస్కెట్‌ను వినియోగదారుడికి విక్రయించినట్లు తెలిపారు.

 

ప్రస్తుతం జొన్నగిరి గనుల నుంచి తొలి విడతగా 100 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసి విక్రయించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేడిన్ ఆంధ్ర బంగారం కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపుతున్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది పరిమితంగానే మార్కెట్లో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని ఉత్పత్తి సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

 

జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం కావడం వల్ల విదేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయని, తద్వారా మన విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ బంగారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పన్ను రాయితీలు ప్రస్తుతానికి లేవని స్పష్టమైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి వర్తించే అన్ని పన్నులు, జీఎస్టీతో కలిపి ఈ బిస్కెట్లను విక్రయిస్తున్నారు.

 

ఇక, కర్నూలులో ఒక జ్యువెలరీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ముందుకు వస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే, వేలాది మంది స్థానిక స్వర్ణకారులకు, ఇతర కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద జొన్నగిరి బంగారం ఉత్పత్తితో రాయలసీమ ప్రాంతంలో కొత్త పారిశ్రామిక శకం ప్రారంభమైందని చెప్పవచ్చు.

ANN TOP 10