AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంలో కొత్త ట్విస్ట్..!

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం కలిగి లేనప్పటికీ, తప్పుడు పత్రాలు సమర్పించి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈ ఫిర్యాదు అందజేశారు. చెన్నమనేని రమేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.

 

తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని రమేశ్ గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల కొట్టివేసింది. అంతేకాకుండా, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఆది శ్రీనివాస్‌కు రూ. 25 లక్షలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ (లీగల్ సర్వీసెస్ అథారిటీ)కి రూ. 5 లక్షలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని రమేశ్‌ను హైకోర్టు ఆదేశించింది.

 

హైకోర్టు ఆదేశాల మేరకు, చెన్నమనేని రమేశ్ సోమవారం డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో ఈ మొత్తాలను ఆది శ్రీనివాస్‌కు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి అందజేశారు. హైకోర్టులో చెన్నమనేని రమేశ్‌కు చుక్కెదురైన నేపథ్యంలో, ఆది శ్రీనివాస్ ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేయడం ఈ వివాదంలో తాజా పరిణామంగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10