భారతదేశంలోని ప్రజలందరికీ పెన్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంపై తీసుకురాబోతోంది.ఈ పథకాన్ని “యూనివర్సల్ పెన్షన్ స్కీమ్” అని పేరు ప్రకటించారు. ప్రతి పౌరుడికి ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రంలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకం రూపొందించేందుకు పనులు ప్రారంభించింది. ఇది స్వచ్ఛంద, సహకారాత్మక పథకంగా ఉంటుంది, ఏ ఉపాధికి సంబంధించినది కాదు. ఎవరైనా దీనికి సహకరించి పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాన్ని ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అయితే ఈ పథకంలో పాత పెన్షన్ పథకాలను కూడా విలీనం చేయనున్నట్లు సమాచారం. ఇది అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు, 60 సంవత్సరాల వయస్సు తర్వాత పెన్షన్ పొందవచ్చు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సేవింగ్ స్కీమ్ పథకాలేవి ప్రస్తుతం నిర్మాణ కూలీలు, ఇంటి పనిమనుషులు, గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) వంటి అసంఘటిత కార్మికుల వర్తించవు. అందుకే వీరందరికీ ఆర్థిక భద్రత అవసరమని భావించి కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ పెన్షన్ స్కీమ్ రూపొందించే పనిలో పడింది.
ప్రస్తుతం ఉన్న పొదుపు, పెన్షన్ పథకాలను హేతుబద్ధీకరించి, ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు, ఉద్యోగంలో లేనివారు కూడా ఈ పథకంలో చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలపై పనులు ప్రారంభమైనట్లు, త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ పథకంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM) మరియు జాతీయ పెన్షన్ పథకం (NPS-ట్రేడర్స్) వంటి పథకాలను కూడా విలీనం చేయవచ్చు. ఈ పథకాలలో 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ అందించబడుతుంది. అయితే ఈ లాభాలు పొందడానికి ప్రతి నెలా రూ.55 నుండి రూ.200 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కూడా డిపాజిట్ చేసిన మొత్తానికి సమానమైన మొత్తాన్ని జమ చేస్తుంది.









