సిర్పూర్ (టి ) అటవీ శాఖ కార్యాలయం ముందు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్ష రెండురోజులుగా కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఎమ్మెల్యే దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యంపై బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు ఎమ్మెల్యేను పరీక్షించారు. బెంగాలీ క్యాంపు రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, అక్రమ కేసులు పెట్టిన అటవీ అధికారులపై చర్యలకు ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అమాయక రైతులపై అటవీ శాఖ దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేదాకా దీక్ష విరమించేది లేదని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు స్పష్టం చేశారు.
కాగా.. వారంరోజుల క్రితం మండలంలోని బెంగాళీ క్యాంపునకు చెందిన ఏడుగురిపై అక్రమంగా కేసుపెట్టి చితకబాధిన అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో సైతం అటవీశాఖ అధికారులు వన్యప్రాణులను చంపారన్న నెపంతో లక్షలు వసూలు చేసి కాగజ్నగర్ డీఎఫ్వోకు కట్టబెట్టారని ఆరోపించారు. అలాగే కాగజ్నగర్ డివిజన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీశాఖకు మంజూరైన కంపా నిధులలో అటవీ అధికారులు లక్షలరూపాయల అవినీతికి పాల్పడ్డారని అవికూడా బహిర్గతం చేయాలన్నారు. అటవీశాఖ అధికారులపై రాష్ట్ర, మంత్రి, మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.