హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను సమీపంలోని ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో ఒకటి నుంచి ఆరు వరకు గ్రామాలను విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సిఫారుల మేరకు.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ జారీ చేశారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట గ్రామాలు విలీనం అయ్యాయి.
శంషాబాద్లో బహదుర్గూడ, పెద్దగోలికొండ, రషీద్గూడ, ఘాన్సీమియంగూడ గ్రామాలు.. నార్సింగిలో మీర్జాగూడ, తుక్కుగూడలో హర్షగూడ గ్రామాలు.. మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూర్, రాల్లాపూర్ గ్రామాలను విలీనం చేసింది. దమ్మాయిగూడలో కీసర, యాద్గారపల్లి, అంకిరెడ్డిపల్లి, చిర్యాల్, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు.. నాగారంలో బోగారం, గొడుంకుంట, కరీంగూడ, రాంపల్లి గ్రామాలు విలీనం అయ్యాయి. పోచారంలో వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల్, కాచివానిసింగారం, చౌదరిగూడ గ్రామాలు.. ఘట్కేసర్లో అంకుషాపూర్, ఔషాపూర్, మధరన్, ఎదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ గ్రామాలు ఉంటాయి.. గుండ్లపోచంపల్లిలో మునీరాబాద్, గౌడవెల్లి. తూంకుంటలో బొమ్మరాసిపేట, శామీర్పేట్, బాబాగూడ గ్రామాలు విలీనమయ్యాయి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో కర్దనూరు, ముత్తంగి, పోచారం, పాటి, ఘనాపూర్ గ్రామాలు.. అమీన్పూర్లో ఇలాపూర్, ఇలాపూర్ తండా, పటేల్గూడ, దయార, కిష్టారెడ్డిపేట్, సుల్తాన్పూర్ గ్రామాలను విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.