అప్రమత్తమైన సిబ్బంది
(అమ్మన్యూస్, వైరా):
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం వైరాకు వెళ్తుండగా పట్టణ సమీపంలో కారు టైర్ పంచర్ అయింది. ఖమ్మంలోని తన నివాస గృహం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని ప్రగడవరం గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి పొంగులేటి బయలుదేరారు. అయితే వైరాలోని హై లెవెల్ వంతెన దిగిన తర్వాత జాతీయ ప్రధాన రహదారిపై పొంగులేటి ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ వాహనం వెనుక భాగంలోని ఎడమ టైరు పంచర్ కు గురైంది. డ్రైవర్ అప్రమత్తమై కారును వెంటనే నిలిపివేశాడు. దీంతో పొంగులేటి కాన్వాయ్ జాతీయ రహదారిపై కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం స్పేర్ వెహికల్ లో అక్కడ నుంచి పొంగులేటి ప్రగడవరం వెళ్లారు.
జీతమందమైనా పనిచేయండి..
జెన్ కో అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మీరు తీసుకున్న జీతం మందమైనా పని చేయండి అంటూ మందలించారు. పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి.. పవర్ ప్లాంట్ ను రెడీ చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. నీరు వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల సంపదను వృథా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులకు ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చారు.