రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి గురువారం వరకు సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం వరకు 312.2 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 407.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.









