AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం ఎంతో నష్టపోయిందని.. రైతు సాధికారత దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని తక్కువ కాలంలోనే నిరూపించామని భట్టి విక్రమార్క తన ప్రసంగంలో తెలిపారు. వివిధ రంగాలకు కేటాయింపులను ఆయన సభలో వివరించారు. మొత్తంగా రూ.2, 91, 191 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

రైతులకు గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యానవన పంటలకు ప్రోత్సహం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హర్టికల్చర్ కోసం ఈ బడ్జెట్‌లో రూ.737 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో నకిలీ విత్తనాల కారణంగా రైతాంగం నష్టపోయిందని.. తమ ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సన్నవడ్డు పండించే రైతులకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా రైతు దిగుబడిని పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానిచడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా పెట్టుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేసిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పూటగడవని నిరుపేదలకు గూడు సమకూర్చడం ప్రభుత్వ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి.. ఇళ్లు కేటాయించకుండా దగా చేసిందన్నారు. పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించామన్నారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షల సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 4లక్షల 50 వేల గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు.

ANN TOP 10