రేవంత్ సర్కార్పై ఎంపీ రఘునందన్ రావు నిప్పులు
(అమ్మన్యూస్, సిద్దిపేట):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతూ కాంగ్రెస్లో చేర్చుకోవడమే తప్ప నిరుద్యోగులపై దృష్టి సారించడంలేదని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
వేరే పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే శ్రద్ధ.. విద్యార్థులు, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా పంపిణీపై పెట్టాలని ఎంపీ హితబోధ చేశారు. రాజకీయ చదరంగంలో పడి సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్లో నంబర్–2గా చెప్పుకునే ఓ మంత్రి.. బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చమని చెప్పే వరకూ చేరికలు కొనసాగుతాయని మాట్లాడడం హాస్యాస్పదం ఉందని రఘునందన్ రావు అన్నారు.
దేశంలోని 736జిల్లాల్లో 550పై చిలుకు జిల్లా కార్యాలయాలను బీజేపీ నిర్మించినట్లు రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. త్వరలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేతులమీదుగా సిద్దిపేట కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ సంస్థగత నిర్మాణం కోసం కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.