హైదరాబాద్ లోని పలు పబ్బులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇటీవల నగరంలోని పలు పబ్స్ లో డ్రగ్స్ సరఫరా అవుతుండటం, డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. నార్కోటిక్ బ్యూరోతో శిక్షణ పొందిన స్నిపర్ డాగ్స్ తో తనిఖీలు చేపడుతున్నారు. వీకెండ్ కావడంతో జూబ్లీహిల్స్ లోని పలు పబ్స్ లో పోలీసులు తనిఖీలు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పలు పబ్స్ లో డ్రగ్స్ విక్రయం, వినియోగం గణనీయంగా పెరిగిపోవడంతో నార్కోటిక్ పోలీసులు, స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. పబ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవలి కాలంలో పలువురు డీజేలు.. పబ్ లకు వస్తున్న కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కొందరు డీజేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీకెండ్స్ లో ముఖ్యంగా జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్స్ లో తనిఖీలు చేపట్టారు. నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక పబ్బుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు.
ఈ రైడ్స్ లో నార్కోటిక్ బ్యారో తర్ఫీదు ఇచ్చిన స్నిపర్ డాగ్స్ తో పోలీసులు చెకింగ్స్ చేశారు. కేవలం వీకెండ్ లో మాత్రమే కాకుండా.. ప్రతిరోజూ కూడా తనిఖీలు ఉంటాయని పోలీసులు తేల్చి చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి విక్రయాలు, వినియోగంపై ఫోకస్ పెట్టింది. ఉక్కుపాదంతో అణిచివేయాలని నిర్ణయించింది. పబ్స్ లో ఎక్కువగా గంజాయి సప్లయ్ అవుతున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్స్ లో పోలీసులు తనిఖీలు చేయనున్నారు.









