AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యం..

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఆయనను అదుపులోకి

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్‌ చేస్తున్న సమయంలో పోలీసులు, రాజాసింగ్‌ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అయితే, రాజాసింగ్‌ అరెస్ట్‌ పై పోలీసులు వివరణ ఇచ్చారు. గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మెదక్‌ లో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ ను ముందస్తుగా అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఇదిలా ఉంటే.. మెదక్‌ లో ఘర్షణల నేపథ్యంలో తాను అక్కడికి వెళ్తానంటూ రాజాసింగ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న ఆయన నేడు హైదరాబాద్‌ కు వచ్చారు. రాజాసింగ్‌ ప్రకటనల నేపథ్యంలో ఆయన కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించిన పోలీసులు.. రాజాసింగ్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు.

మల్టీజోన్‌ ఐజీ రంగనాథ్‌ ఇప్పటికే మెదక్‌ లో పర్యటించారు. ఘర్షణ నేపథ్యంలో మెదక్‌ పట్టణం, మండలం వ్యాప్తంగా 144 సెక్షన్‌ ను విధించారు. శనివారం సాయంత్రం మెదక్‌ లో జరిగిన ఘర్షణలకు కారణమైన ఇరు వర్గాల్లో 45 మందిని గుర్తించినట్లు ఐజీ పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరూ చట్టాన్ని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవొద్దని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పశువులు తరలిస్తున్నట్లు ఏమైనా సమాచారం అందితే, ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేయాలని సూచించారు.

ఎందుకు ఘర్షణ జరిగిందంటే..?
జంతువధకు సంబంధించి మెదక్‌ జిల్లా కేంద్రంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అంతటితో ఆగకుండా ఆ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాలకు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నేతలు మెదక్‌ పట్టణ బంద్‌ కు పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసులు మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు.

ANN TOP 10